వాఘా (పంజాబీ(గురుముఖి): ਵਾਹਗਾ, ఆంగ్లము: Wagah,హిందీ:वाघा,ఉర్దూ:واہگہ) భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దును దాటే రహదారి సమీపంలో ఉన్న గ్రామం, సరుకు రవాణా టర్మినల్ మరియు రైల్వే స్టేషన్. భారతదేశంలోని అమృత్సర్, పాకిస్తాన్లోని లాహోర్ నగరాలను కలిపే గ్రాండ్ట్రంక్ రోడ్డుపై ఈ గ్రామం నెలకొని ఉంది.
భారత్-పాక్ సరిహద్దు లాహోర్ నుండి 24 కిలోమీటర్లు (15 మైళ్ళు) దూరంలోను, అమృత్సర్ నుండి32 కిలోమీటర్లు (20 మైళ్ళు) దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం అట్టారి గ్రామానికి 3 కిలోమీటర్లు (1.9 మైళ్ళు)ల సమీపంలో ఉంది.
వాఘా (పాకిస్తాన్లో వాహ్ఘా) భారత పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ అవార్డ్ ప్రకారము గీచిన విభజనరేఖ సమీపంలో ఉన్న గ్రామం. ఈ గ్రామం సరిహద్దురేఖకు పశ్చిమాన 600 మీటర్ల దూరంలో ఉంది. 1947లో దేశవిభజన సమయంలో భారతదేశంలోని అనేక మంది ముస్లిం ప్రజలు ఈ ప్రాంతం నుండే పాకిస్తాన్ దేశానికి వలస వెళ్ళారు. పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని వాఘా బార్డర్ అని పిలుస్తారు. కాగా భారతీయులుఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న అట్టారి అనే గ్రామం పేరుతో దీనిని అట్టారి బార్డర్ అని పిలుస్తారు.
ఈ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు జరుగుతుంది. 1959నుండి ఈ ఆనవాయితీ ఉన్నది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్) సైనికులు, పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని చూడటానికి ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది.