త్రియుగీ నారాయణ్ ఆలయం (సంస్కృతం: त्रियुगी-नारायण) ఉత్తరాఖండ్ కు చెందిన రుద్రప్రయాగ జిల్లాలోని త్రియుగీ నారాయణ్ గ్రామంలో నెలకొన్ని హిందూ దేవాలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఆలయానికి ప్రశస్తి ఉంది.
రా౦పూరు ను౦డి 5 కిలోమీటర్ల దూర౦లో త్రియుగి నారాయణ్ క్షేత్రం ఉంది. ఇది చాల చిన్న గ్రామం. ఇది చాల పురాతనమయిన పవిత్ర స్థలము. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలం . ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. అక్కడ హోమగుండం ఉ౦ది. అది మూడు యుగాల నుండి అలావెలుగుతూనే ఉన్నదని చెబుతారు. దీని పక్కన ఒక మనిషి కూర్చుని ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు ఆ హోమకుండంలో తలొక కట్టే వేస్తారు. ఆ హోమకుండము లోని విభూతి అతి పవిత్రమైనదిగా భావిస్తారు. మూడు యుగముల నుండి ఈ మంట మండుతూనే ఉన్నది కనుక దీనికి ఈ ఆలయం లో ఉన్న నారాయణుడే సాక్షి కనుక ,ఈ స్వామికి త్రియుగి నారాయణ్ అనే పీరు వచ్చింది యని స్థలపురాణము. ఆలయం బయట ఒక చిన్నమందిరం ఉంది .నాలుగు మూలలా రాతి స్తంభాలు ,రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుండి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉంది.సత్య యుగములో శివపార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగింది అని స్దలపురాణం. ఆలయం బయట ప్రాంగణము లో 3కుండములు వరసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వీటిని బ్రహ్మకుండము,విష్ణుకుడమ సరస్వతీ కుండం అని అంటారు.
త్రియుగీ నారాయణ్ అన్నది త్రియుగి, నారాయణ్ అన్న రెండు పదాల కలయికగా రూపొందింది. వీటిలో నారాయణ్ అన్నది కొలువైవున్న దేవుని గురించిన పదం కాగా, త్రియుగి పదానికి పలు అర్థాలు చెప్తున్నారు. హిందూ నమ్మకాల ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తూండగా ఈ ఆలయానికి సత్య, ద్వాపర, త్రేతా యుగాల వైభవం కలిగివుందనీ, అత్యంత సుదీర్ఘమైన దేవమానంలో దేవతల మూడు తరాలను చూసినదనీ పలు విధాలైన అర్థాలను త్రియుగీ అన్న శబ్దానికి చెప్తారు. అలానే వసంత, శరత్తు, వర్ష రుతువులు ఒకే సమయంలోనూ, త్రేతాగ్నులుగా భావించే మూడు అగ్నులు ఎల్లప్పుడూ నివసించేదనీ అర్థం చెప్తూంటారు. ఈ అర్థం కాక త్రియుగి అన్న శబ్దానికి గుప్తం అంటే రహస్యం, అదృశ్యం అన్న అర్థం ఉండగా, నారాయణుడన్న శబ్దానికి వ్యాపకార్థం ఉంది. దీని ప్రకారం అదృశ్యంగా, అంతటా వ్యాప్తి పొందినవాడన్న అర్థం త్రియుగీ నారాయణునికి అన్వయిస్తూంటారు.
తారకాసురుడు అపార తపస్సుతో బ్రహ్మను మెప్పించి, శివపుత్రుని తప్ప మరెవ్వరితోనూ తన మరణం సంభవించకూడదని వరం పొంది ముల్లోకాలను తిప్పలు పెట్టాడు. కామదహనం, పార్వతీదేవి కఠోర తపస్సు వంటివి పూర్తిచేశాకా, పుత్రప్రాప్తికై పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నది త్రియుగీ నారాయణ్ వద్దనేనని ఐతిహ్యం. ఆదిదంపతుల వివాహం ఇక్కడి ధర్మశిలలోనే జరిగిందని భావిస్తారు. వివాహంలో భాగంగా శివపార్వతులు యజ్ఞం చేసి ప్రదక్షిణ చేసిన యజ్ఞగుండంలో విష్ణుమూర్తి అగ్నిరూపంలో జ్వలిస్తున్నాడని పౌరాణిక కథనం. యజ్ఞకుండంలో వేసే హవిస్సును అగ్నిదేవుడు, స్వాహాదేవి స్వీకరించి భగవంతుడికి అందిస్తారని సనాతన విధానం తెలుపుతుండగా, ఇక్కడ మాత్రం హవిస్సును నేరుగా విష్ణుమూర్తే స్వీకరిస్తున్నాడని చెప్తారు. వైష్ణవుల ప్రకారం త్రియుగీ నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్య నివాసస్థానం, శైవులు దీన్ని శివపార్వతుల వివాహం జరిగినందుకు పుణ్యస్థలిగా భావిస్తారు.
ప్రయాణ సౌకర్యాలు రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
రోడ్డు ప్రయాణంరుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గం లో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గం లో కలదు. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవి లో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సు లు రుద్రప్రయాగ్ మీదుగానే వెళతాయి. కేశ్ నుండి రుద్రప్రయాగ్ కు రెగ్యులర్ బస్సు లు కలవు.
రైలు మార్గంరుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషను సమీపం. కొన్ని రైళ్ళ తో ఇది ఒక చిన్న రైలు స్టేషను. అయితే 24 కి. మీ. ల దూరం లో కల హరిద్వార్ రైలు జంక్షస్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూస్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీ లు లభిస్తాయి.