పాకిస్తాన్ పశ్చిమోత్తర భాగం చిత్రపటంలో స్వాత్ (పసుపు రంగులో చూపబడింది) ప్రకృతి రమణీయతకు పేరొంది, పాకిస్తాను దేశపు స్విట్జర్లాండ్ అనబడు ప్రాంతము స్వాత్ లోయ[1]. ఇచట ప్రవహించు స్వాత్ నది పేరుమీద ఈ ప్రాంతమునకు, మండలమునకు పేరులు అబ్బాయి. ప్రాచీన భారతములో స్వాత్ పేరు సువస్తు. పాకిస్తాన్ లోని వాయువ్య రాష్ట్రములో, రాజధాని ఇస్లామాబాద్ నకు 160 కి.మీ. దూరములో నున్నది. స్వాత్ మండలములోని ముఖ్య పట్టణము సైదు షరీఫ్. ఇస్లామిక ఉగ్రవాదులు (తాలిబన్లు) స్వాత్ లోయను ఆక్రమించి[2], అచట షరియా చట్టము చెల్లునటుల పాకిస్తాన్ ప్రభుత్వముతో ఒడంబడిక చేసుకున్నారు. ఈ ప్రాంతములో 170 పాఠశాలలు ధ్వంసము చేసి, బాలికలకు విద్యను దూరము చేశారు.[3]
సువస్తు నదీ ప్రస్తావన తొలుత ఋగ్వేదము (8.19.37) లో గలదు[4][5]. ఋగ్వేద కాలములో ఈ ప్రాంతముపేరు ఉద్యానము. క్రీ. పూ. 4వ శతాబ్దిలో జరిగిన అలెగ్జాండర్ దండయాత్రలో ఇచటి ఉదేగ్రామ, బారికోట గ్రీకుల వశమయ్యాయి. క్రీ.పూ. 325లో స్వాత్ లోయ, ఆఫ్ఘనిస్తాన్ మౌర్యులపాలనలోకి వచ్చాయి. స్వాత్ లోయ అందాలకు, చక్కని ప్రశాంత వాతావరణమునకు ముగ్ధులైన బౌద్ధులు, ఇండో-గ్రీకులు, కుషాణులు క్రీ.పూ రెండవ శతాబ్దిలో ఇచట స్థిరపడ్డారు. వజ్రయాన బౌద్ధము ఇచటనే ఉద్భవించినది. పలు బౌద్ధ స్తూపాలు, శాక్యముని విగ్రహ సంపదకు స్వాత్ లోయ నెలవు[6].
గాంధార లేక స్వాత్ సంస్కృతి (క్రీ.పూ. 1700 నుండి క్రీ.పూ. 300 వరకు) గాంధార దేశము, స్వాత్ నదీ పరివాహక ప్రాంతములో వ్యాపించినది. అప్పటి ప్రజలు (ఇండో-ఆర్యులు) వేద సంస్కృతము, ప్రాచీన పారశీకము మొదలగు ఆర్య భాషలు మాట్లాడేవారు[7]. క్రీ.పూ. 1700-1100 మధ్య ఆర్యులు స్వాత్ లోయ, సప్త సింధు మైదానములలో తొలుత ఋగ్వేదమును ఉచ్చరించారు[8][9]. ఈ ప్రాంతములన్నియూ క్రీ. పూ 500 (పాణిని కాలము) వరకు వేద మంత్రోచ్చారణలతో ప్రతిధ్వనించుచుండెడివి. .
క్రీ. పూ 4వ శతాబ్ది కాలములో స్వాత్ లోయ మౌర్య చక్రవర్తుల ఆధిపత్యము క్రిందికి వచ్చినది. అశోక చక్రవర్తి ప్రభావముతో బౌద్ధము ఇచట అడుగిడింది. పద్మసంభవుడను భిక్షువు మొదటి బౌద్ధ ఆశ్రమమును స్థాపించాడు. ఈతడే తాంత్రిక బౌద్ధమును టిబెట్ లోనికి వ్యాపింపచేశాడు. పిదప తొమ్మిది శతాబ్దములు గాంధారములోను, స్వాత్ లోయలోను బౌద్ధము పరిఢవిల్లింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాంధార శిల్పము బుద్ధుని సుందర ప్రతిమలకు, విహారములకు, స్తూపములకు మూల స్థంభమయ్యింది. ఆశియా ఖండము నలుమూలల నుండి జ్ఞానపిపాసులైన బౌద్ధులు ఈ ప్రాంతమును సందర్శించి బౌద్ధమును చదివి పలుప్రాంతములకు వ్యాపింప చేశారు. స్వాత్ లోయలో 1400 స్తూపములు, విహారములు, 6000 సువర్ణ బుద్ధ ప్రతిమలు ఉండెడివి. ప్రస్తుతము 160 చదరపు కి.మీ. ప్రాంతములో 400 బౌద్ధ స్థలాలు ఉన్నాయి. బుత్ఖారా స్తూపములో బుద్ధుని అవశేషములు దొరికాయి. ఘలేగే అను ఊరిలో శిలలో తొలుచబడిన చక్కని బౌద్ధ విగ్రమున్నది. దీని సమీపములో ఒక పెద్ద బౌద్ధ స్తూపము గలదు.
స్వాత్ నది. స్వాత్ నది హిందూకుష్ పర్వతాలనుండి పాకిస్తాన్ పశ్చిమోత్తర ప్రాంతపు కలామ్ లోయగుండా ప్రనహించి పెషావర్ లోయలోని కాబూల్ నదిలో కలుస్తుంది. స్వాత్ జిల్లాలో వ్యవసాయానికి, మత్స్యపరిశ్రమకు ఇది ముఖ్యమైన ఆధారం. సుందరమైన ఈ నదీలోయను సందర్శించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నదిపై రెండు జలవిద్యుత్కేంద్రాలు ఉన్నాయి.
ఋగ్వేదం (8.19.37) లో ఈ నది "సువస్తు" అని చెప్పబడింది. అలెగ్జాండర్ తన సైన్యంతో ఈ నదిని దాటినట్లు తెలుస్తున్నది. ఈ నది తీరప్రాంతం ఒకప్పుడు "శ్రీవస్తు" అని, తరువాత "సువస్తు" అని పిలువబడ్డాయి.
తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని,అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి చెందిన ఐఎస్ఐ కలసి తాలిబన్ లకు ఊపిరిపోశాయని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు.(ఈనాడు - 10 మే 2009)
వర్గం:పాకిస్తాన్
en:Swat, Pakistan hi:स्वात ar:سوات cs:Svát cy:Swat da:Swat (Pakistan) de:Swat (Distrikt) fa:سوات fi:Swatin laakso fr:District de Swat ia:Swat it:Swat (Pakistan) ko:스와트 (파키스탄) nl:Swat no:Swat (Pakistan) pl:Dolina Swat pt:Swat (Paquistão) ru:Сват (Пакистан) sh:Swat (Pakistan) simple:Swat District sv:Swat ur:سوات wuu:斯伐脱县
zh:斯瓦特县