హిందీ: आमेर क़िलाఅమర్ కోట గా కూడా పిలవబడే అంబర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరాన ఉంది. రాజధానిని ఈనాటి జైపూర్ కు తరలించడానికి పూర్వం ఇది అంబర్ కచ్చవా వంశ పాలకుల ప్రాచీన దుర్గంగా ఉండేది. ప్రత్యేకించి హిందూ, ముస్లిం (మొఘల్ ) శిల్ప కళా శైలుల మేలు కలయిక అయిన అచ్చేరువొందించే అద్వితీయ శిల్ప కళా నైపుణ్యం, అలంకరణలకు అంబర్ కోట ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని మాఓట సరస్సు అంచున గల ఈ కోట పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంది.
వాస్తవానికి అంబర్ మీనాలుచే 'గట్టా రాణి' లేక 'పర్వత మార్గం రాణి' గా పిలవబడే దేవతల తల్లి, అంబకు సమర్పించబడిన నగరంలో నిర్మించబడింది. [Tod.II.282 ]. 1592లో అక్బర్ సైన్యానికి సేనాధిపతి, అక్బర్ చక్రవర్తికి అత్యంత సన్నిహితులైన తొమ్మిది మంది రాజసేవకులలో ఒకరూ అయిన రాజా మాన్ సింగ్ పాలనలో, ఈనాడు మనం చూసే కోటల సముదాయం యొక్క నిర్మాణం ఒక శిధిల కట్టడం పై ప్రారంభించబడింది. మొత్తం కోట నిర్మాణం అతడి సంతతి వాడు అయిన ఒకటవ జైసింగ్ ద్వారా పూర్తి చెయ్యబడింది. ఆ తర్వాత 150 సంవత్సరాల కాలంలో, రెండవ సవాయి జైసింగ్ కాలంలో కచ్చవులు తమ రాజధానిని జైపూర్ కు తరలించినప్పటి వరకూ, ఒకరి తర్వాత ఒకరుగా వివిధ రాజులు తమ పాలనా కాలంలో అంబర్ కోటకు అనేక మార్పులు చెయ్యడం జరిగింది.
నిజానికి నేడు "అంబర్ కోట"గా పిలవబడుతోన్న నిర్మాణం, ఈనాడు జయ ఘర్ కోట అని పిలవబడుతోన్న అసలైన అంబర్ కోటలో ఒక కోటల సముదాయంగా ఉండేది. అంబర్ కాంప్లెక్స్ లో గల ఒక కొండ పై తెల్ల పాలరాయి మరియు ఎర్రని ఇసుక రాయితో నిర్మించబడిన జైఘర్ కోట పటిష్ఠమైన బాటల ద్వారా అంబర్ తో అనుసంధానించబడి ఉంది. మావుత సరస్సును చూస్తూ ఉన్నట్టుగా నిలిచిన ఈ నిర్మాణాన్ని కచ్చవా పాలకుల ధనాగారంగా భావించేవారు.
మొత్తం కోటల సముదాయం వలెనే, అంబర్ కోట కూడా తెల్లని పాల రాయి మరియు ఎర్రని ఇసుక రాళ్లతో నిర్మించబడింది. కోట అంతర్ భాగం హిందూ, ముస్లిం (మొఘలు) శిల్ప కళల మేలు కలయిక అయిన అద్వితీయమైన శిల్పకళతో అమితంగా అలంకృతమై ఉండగా, కోట వెలుపలి భాగం మోటుగా, ధృఢమైనదిగా ఉండటం కోట యొక్క ప్రత్యేకత. కోట అంతర్భాగంలోని గోడల పై వర్ణ చిత్రాలు, కుడ్య చిత్రాలు, దైనందిన జీవితంలోని వివిధ అంశాలను వర్ణించే చిత్రాలు దర్శనం ఇస్తాయి. ఇతర గోడల పై పాల రాయి, చిన్న-చిన్న అద్దాలతో చేసిన పనితనం, క్లిష్టమైన శిల్ప కళా నైపుణ్యాలను చూడవచ్చు.
అంబర్ కోట నాలుగు భాగాలుగా విభజించబడింది. మధ్య ప్రదేశంలో గల పెద్ద మెట్ల మార్గాల గుండా లేదా పెద్ద బాటల గుండా ప్రతీ భాగాన్నీ చేరుకోగలిగే అవకాశం గలదు. ప్రస్తుతం ఈ బాటలను ఏనుగుల సవారీ ద్వారా సందర్శకులను చేరవేసేందుకు ఉపయోగిస్తున్నారు. అంబర్ కోట ప్రధాన ప్రవేశం, సురాజ్పోల్ కోటను చేరుకునేందుకు మెట్లు గల జలేబ్ చౌక్ గా పిలవబడే కోట ప్రధాన ఆవరణకు దారి తీస్తుంది. వెనుకటి కాలంలో తిరిగి వచ్చిన సైనికులు ఈ జలేబ్ చౌక్ అనబడే ప్రదేశం నుండి కవాతు చేస్తూ ఇళ్ళకు చేరుకునేవారు.
కోట ప్రవేశ ద్వారానికి ముందు ఉన్న ఇరుకైన మెట్ల మార్గం శైలాదేవి ఆలయంగా కూడా పిలవబడే కాళి ఆలయానికి దారి తీస్తుంది, అతి పెద్ద వెండి సింహాల కారణంగా ఈ ఆలయం ఖ్యాతి గాంచింది. ఈ వెండి సింహాల మూలాలు, ప్రయోజనాలు ఈనాటికీ ఎవరికీ తెలియని విషయాలు. ఉబ్బెత్తుగా కనిపించేలా చెక్కిన శిల్పకళతో అలంకరించబడిన వెండి తలుపులకు కాళికాలయం ప్రసిద్ధి చెందింది. బెంగాల్ పాలకుల పై విజయం సాధించేందుకు గాను 1వ మాన్ సింగ్ కాళిని ఆరాధించే వాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. కాళి మహారాజు కలలో ప్రత్యక్షమై, జెస్సోర్ సముద్రం అడుగున (నేడు బంగ్లాదేశ్ లో ఉన్నది) ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీసి ఒక సముచితమైన ఆలయంలో ఉంచవలసిందిగా ఆజ్ఞాపించినట్టు ఇతిహాసం చెబుతోంది. చరిత్ర చెబుతున్నది ఎంత వరకూ వాస్తవం అనేది ధ్రువీకరించబడలేదు. అయినప్పటికీ, మహారాజు సముద్రం అడుగు నుండి విగ్రహాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మింపచేసాడని అంటారు. మందిర ప్రవేశ ద్వారం వద్ద గల, ఒకే ఒక పగడం నుండి చెక్కిన వినాయక విగ్రహం సందర్శకులకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
నేడు పర్యాటకులు కొండ దిగువ భాగం నుండి ఏనుగు సవారీలను ఎక్కి కోట వరకు చేరుకోవచ్చు. సవారీ చేస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న కొండలు, భవనాలు, మావుత సరస్సు, ఒకప్పటి నగర ప్రహరీ గోడలను చూడవచ్చు. ఎవరికి వారు స్వంతంగా గానీ లేదా గైడ్ సహాయంతో గానీ కోటను పర్యటించవచ్చు. వివిధ భాషల ఆడియో గైడ్లు కూడా లభిస్తాయి. సాయంత్రం వేళ ఏర్పాటు చేసే సౌండ్ అండ్ లైట్ షో తప్పక చూడాల్సిన వినోదం. కోటలోని ప్రత్యేక ఆకర్షణలలో షీష్ మహలు (అద్దాల హాలు) ఒకటి. కోటలో రాజులు నివసించినప్పటి కాలంలో, ఒకే ఒక కొవ్వొత్తిని వెలిగించగా మహలులోని అసంఖ్యాకంగా గల చిన్న-చిన్న అద్దాల కారణంగా హాలు మొత్తం వెలుగు నిండేది అని టూర్ గైడ్లు సందర్శకులకు చెబుతారు.
ఆమ్బెర్ ఫొర్త్ -