ఆగ్రా కోట (Agra Fort), ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా లో కలదు. దీనిని యునెస్కో వారు, ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించారు. ఇది ప్రఖ్యాత తాజ్ మహల్ కు వాయువ్యంలో 2.5 కి.మీ. దూరాన గలదు. ఈ కోటకు 'లాల్ ఖిలా' (ఎర్రకోట కాదు) అని కూడా అంటారు.
భారతదేశం లోని ముఖ్యమైన కోటలలో ఒకటి. మొఘలులు బాబరు, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాను మరియు ఔరంగజేబు లు నివసించారు. దీనిని విదేశీ దౌత్యవేత్తలు, యాత్రికులు, ఉన్నత పదవులను అలంకరించినవారు సందర్శించారు.
వాస్తవంగా దీనిని రాజపుత్రులు చౌహానులు నిర్మించారు. ఇది ఇటుకలతో నిర్మించిన కోట. అక్బర్ దీని ప్రాముఖ్యతను గుర్తించి, శిథిలమైన ఈ కోటను పునర్నిర్మించి, 1558లో ఆగ్రాను రాజధానిగా చేసుకొని, ఈకోట యందే జీవించాడు. అక్బర్ దీనిని, ఇసుక రాతితో నిర్మించాడు. అంతర్భాగం ఇటుకలతోనూ, బాహ్యభాగం ఇసుకరాతితోనూ నిర్మించాడు. దీనిని నిర్మించుటకు 1444000 మంది పనిచేశారు. 1573 లో దీని నిర్మాణం పూర్తయింది.
భారత ప్రభుత్వం ఈ కోట సంస్మణార్థం 28-11-2004 న, ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.