సబర్మతీ ఆశ్రమం ( దీనికే గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పేరు) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. గాంధీ తన భార్య అయిన కస్తూర్భా తో పాటు ఇక్కడ పన్నెండేళ్ళు నివాసమున్నాడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది. ఉద్యమంలో కీలక ఘట్టాలయిన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమైనాయి. అందుకనే భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది.
గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్ లాల్ దేశాయ్ అనే స్నేహితుడికి సంబంధించిన కోచారబ్ బంగళా లో మే 25, 1915న ఒక ఆశ్రమాన్ని ప్రారంభించాడు. మొదట్లో దాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. కానీ గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ లాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకోవడంలో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం రెండు సంవత్సరాల తర్వాత జూన్ 17, 1917న సబర్మతీ నది ఒడ్డున 36 ఎకరాల సువిశాల స్థలానికి ఆశ్రమాన్ని తరలించారు.
ఈ ఆశ్రమం జైలుకు, శ్మశానికి మధ్యలో ఉండేది. ఒక సత్యాగ్రాహి అనేవాడు ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దీన్ని అనువైన ప్రదేశంగా భావించాడు. ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత మొదలైన అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాల లాంటి దాన్ని నెలకొల్పాడు. దేశం స్వయంసంవృధ్ధి సాధించడం దీని లక్ష్యం.
గాంధీజీ ఈ ఆశ్రమం నుంచే 1930, మార్చి 12న అక్కడికి 241 మైళ్ళ దూరంలో ఉన్న దండికి 78మంది అనుచరులతో యాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రగా స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగా ఈ ఉద్యమం సాగింది.
కేవలం ఆశ్రమ వాసులతో ప్రారంభమైన ఈ ఉప్పు సత్యాగ్రహం దేశమంతా విస్తరించి అహింసా విధానంలో ఆంగ్లేయులను వణికించింది. ఆ సంవత్సరం టైమ్ పత్రిక గాంధీజీని మేటి పురుషుడిగా పేర్కొన్నది. గాంధీజీ సరిగా ఏ ప్రదేశంలో అయితే ఉప్పును చేతిలోకి తీసుకొన్నాడో అక్కడ ఒక స్మృతిచిహ్నం నిర్మించారు.
ప్రస్తుతం ఈ ఆశ్రమంలో గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో దీన్ని గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ అయిన చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశాడు. ఇది 1963, మే 10న అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూచే ప్రారంభించబడింది. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు అమర్చారు.
ఆశ్రమ ప్రాంగణంలోనే వినోబా-మీరా నివసించిన వినోబా-మీరా కుటీరం, ప్రార్థనా భూమి, కుటీర పరిశ్రమలకు శిక్షణనిచ్చే కేంద్రం మొదలైనవి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆశ్రమాన్ని సందర్శకుల కోసం తెరుస్తారు.