హవా మహల్, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో గల ఒక మేడ. దీన్ని మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ 1799 సంవత్సరంలో నిర్మించాడు. దీని రూపకర్త లాల్చంద్ ఉస్తా. శ్రీ కృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీన్ని నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయటి వాళ్ళ కంట పడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. వీటి ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది కాబట్టి దీనికా పేరు వచ్చింది.